Thursday, November 22, 2012

మధుమేహంతో జాగ్రత్త అవసరమే

ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మన దేశం ప్రసిద్ధికెక్కింది. 35 మిలియన్లకిపైగా ఇప్పటికే మన దేశంలో మధుమేహంబారిన పడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకి పెరగవచ్చునని ఒక అంచనా. మన దేశంలో కూడా మధుమేహ పీడితులకు ‘హైదరాబాద్’ అగ్రగామిగా నిలుస్తోంది.హైదరాబాద్‌లో 20కి పైబడిన వాళ్ళల్లో 16 శాతంమంది మధుమేహంతో బాధపడుతున్నారు. 30 శాతం మంది ప్రి డయాబెటిక్ స్టేజీలో ఉన్నారు. హైదరాబాద్‌లో 40కిపైబడ్డ ప్రతీ ఇద్దరిలో ఒకరికి మధుమేహం పీడిస్తుంది.


దురదృష్టం కొద్దీ మధుమేహ లక్షణాలు అంతగా బాధించేవి కావు. అందుకే దానిని అంతగా పట్టించుకోము. నష్టం జరిగిపోయిన తర్వాతగానీ, దాని నిజస్వరూపం బయటపడదు.కాబట్టే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. రక్తంలో షుగర్ ఎక్కువైతే దాహం పెరగవచ్చు,మూత్రం ఎక్కువసార్లు అవుతుండవచ్చు. దెబ్బలేమైనా తగిలితే త్వరగా మానవు.బరువు తగ్గుతుంది. అలసట,మర్మావయవాల దగ్గర దురద లాంటి లక్షణాలు ఉండవచ్చు.విచిత్రమేమిటంటే తమకు మధుమేహం ఉందని మధుమేహం ఉన్నవాళ్ళల్లో 60 శాతం మందికి తెలియదని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలతో వెల్లడైంది.తెలుసుకున్న వాళ్ళల్లో 50 శాతంమంది మాత్రమే తగిన వైద్యాన్ని తీసుకుంటున్నారు. నగరాల్లో సంగతి ఇలా ఉంటే పల్లెల్లో సంగతి చెప్పనక్కర్లేదు.


తెలిసినా, తెలియకపోయినా మధుమేహం వల్ల నరాలు, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు,కాలేయం, కళ్లు, పాదాలు లాంటివెన్నో దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహం గురించి  అన్ని విషయాలు అందరూ తెలుసుకోవాలి.మధుమేహం నుంచి అందరూ రక్షణ పొందాలి.


మధుమేహ పరీక్షలు ఎవ్వరు చేయించుకోవాలి?

-కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే...

-35 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ...

-అధిక బరువు, ఊబకాయం ఉన్నవాళ్ళు...

-90 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఛాతీ వున్న మగవాళ్ళూ, 80 సెం.మీ కన్నా తక్కువ ఛాతీ వున్న ఆడవాళ్లూ...

-ఎక్కువ కదలికలు లేని జీవితాన్నిగడుపుతున్నవాళ్ళూ...

-ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నవాళ్ళు...

-అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు...

-కొలెస్ట్రాల్ లేక ట్రైగ్లిజరైట్స్ స్థాయి ఎక్కువగా ఉన్నవాళ్ళు...

-3.5 కి.గ్రా. బరువున్న శిశువుకు జన్మనిచ్చిన స్ర్తి...

-స్టెరాయిడ్స్ తీసుకునేవాళ్ళు...


మధుమేహం రిస్క్ ఎలా ఉంటుంది 

తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉంటే... 99 శాతం

తల్లిదండ్రులలో ఒకరికి మధుమేహం ఉండి రెండోవాళ్ళ బంధువులెవరికైనా మధుమేహం ఉంటే... 75 శాతం తల్లిదండ్రులలో ఒక్కరికే మధుమేహం ఉంటే...50 శాతం 

తల్లిదండ్రులకుగా కదగ్గర బంధువులకెవరికైనా ఉంటే...25 శాతం


బ్లడ్‌షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటే...దానితో బెంబేలు పడిపోవాల్సిన పనిలేదు. రక్తంలో పెరిగిన గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి ప్రయత్నించాలి. మొదట పదేళ్ళు మధుమేహం అదుపులో ఉంటే ఫర్వాలేదు. దీని తాలూకు ప్రభావం మిగతా అవయవాలమీద పడదు. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తూ అవసరమైన మందుల్ని వాడుతూ, ఒత్తిడిని తగ్గించుకుంటూ, కొన్ని అలవాట్లని మందు, ధూమపానంలాంటి వాటిని మానుకొని జీవన విధానాన్ని మార్చుకోవడంతో మధుమేహాన్నిఅదుపులో ఉంచుకోవచ్చు. అలా పదేళ్ళు నిర్లక్ష్యం చేస్తే మధుమేహ ప్రభావం వ్యాధి కాదుగాని,నిర్లక్ష్యం చేస్తే ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. 


అంటే ఖచ్చితంగా చెప్పాలంటే మధుమేహం ‘చాపకింద నీరులాంటిది’. రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చాలా అవయవాలు దెబ్బతినవచ్చు.మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయి. నరాలు దెబ్బతింటాయి. ముందుగా శరీరంలో పొడవైన నరం... అంటే పాదాలలో ముగిసే నరాలు.. కంటికి వెళ్ళే ఆప్టిక్ నెర్వ్ మధుమేహంవల్ల దెబ్బతినవచ్చు. అంటే కాళ్ళు, కళ్ళు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పాదాలలో నరాలు దెబ్బతినడంవల్ల మొదట్లో స్పర్శ ఎక్కువై, ఆ తర్వాత స్పర్శ పూర్తిగా తగ్గిపోయి బాధపడతారు. పాదాలలో ఏమైనా దిగినా తెలీదు. కారణం నొప్పిలేకపోవడమే! నరాలు దెబ్బతినడంవల్ల నొప్పి తెలీదు. పాదాలకు రక్తప్రసరణ మధుమేహంలో క్రమంగా తగ్గుతుంది. కాబట్టి గాయం మానదు. పైగా ఆ ప్రాంతంలోకి రక్తసరఫరా సరిగ్గా లేకపోతే గాంగ్రీన్ కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఎక్కడో బొటన వేలు దగ్గర ప్రారంభమైన గాంగ్రీన్  ప్రభావం క్రమంగా కాలంతా కూడా చూపించవచ్చు.

No comments:

Post a Comment